ఖరీఫ్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

  • ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షపాతం తగ్గుతుందని అంచనా
  • ముందస్తు చర్యలు చేపట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్రాలకు ఆదేశాలు
  • జిల్లాల వారీగా పంటల ప్రణాళికలు, నీటి యాజమాన్యంపై దృష్టి
  • తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచన
  • రైతులు ఆందోళన చెందవద్దన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ప్రతి జిల్లాలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా తక్కువ నీటితో, తక్కువ కాలంలో దిగుబడినిచ్చే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కరవును తట్టుకునే విత్తన రకాలను అందుబాటులో ఉంచాలని, విత్తన నిల్వలు, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేసింది.

ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 92 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని, 35 శాతం వరకు కరవు పరిస్థితులు ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. "రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు సంతృప్తికరంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. కాగా, రుతుపవనాలపై తుది అంచనాను వాతావరణ శాఖ ఈ నెలాఖరులో విడుదల చేయనుంది.

El Nino
El Nino effect
kharif season
India Meteorological Department
IMD
Shivraj Singh Chouhan
monsoon
rainfall
agriculture
drought

More Telugu News